హర్మూజ్ జలసంధి మూసివేత: రూ. 10 లక్షల కోట్ల సరుకుతో నిలిచిపోయిన 1,200 నౌకలు!

  • ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో మొదలైన సంక్షోభం
  • హర్మూజ్ జలసంధి మూసివేతతో నిలిచిపోయిన చమురు సరఫరా
  • ఉద్రిక్తతలతో 100 డాలర్ల మార్కును దాటిన బ్యారెల్ ముడిచమురు ధర
  • సముద్రంలో నెలల తరబడి చిక్కుకుపోయిన 20 వేల మంది నావికులు
ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గమైన 'హర్మూజ్ జలసంధి'సుదీర్ఘ మూసివేతతో అంతర్జాతీయ వాణిజ్యం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పర్షియన్ గల్ఫ్‌లో దాదాపు 125 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 10.4 లక్షల కోట్లు) విలువైన సరుకుతో ఉన్న 1,200కి పైగా సరుకు రవాణా నౌకలు అక్కడే నిలిచిపోయినట్లు సముద్ర బీమా సంస్థలు, షిప్పింగ్ డేటా నివేదికలు వెల్లడించాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ అంతర్జాతీయ జలమార్గం గుండా రవాణా పూర్తిగా నిలిచిపోయింది.

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్‌జీ)లో ఐదో వంతు వాటా ఈ ఇరుకైన జలసంధి గుండానే సాగుతుంది. ఫిబ్రవరి 2026 చివరలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులు చేయడంతో ఈ సంక్షోభం ప్రారంభమైంది. జూన్ మధ్యలో అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయంటూ ఇరాన్ చేసిన తాజా ప్రకటనలు మళ్లీ ఆందోళనలను పెంచాయి.

సంక్షోభ తీవ్రత - నావికుల ఇబ్బందులు
అలియాంజ్ కమర్షియల్ సేఫ్టీ అండ్ షిప్పింగ్ నివేదిక ప్రకారం.. జూన్ మధ్య నాటికి సుమారు 29 మిలియన్ గ్రాస్ టన్నుల బరువున్న 1,150 నుండి 1,200 సరుకు రవాణా నౌకలు నిలిచిపోయాయి. వీటితో పాటు దాదాపు 20,000 మంది నావికులు నెలల తరబడి సముద్రంలోనే చిక్కుకుపోయారు. ఆహార కొరత, మానవీయ సంక్షోభం ఎదుర్కొంటున్న ఈ సిబ్బందిని సురక్షితంగా తరలించేందుకు ఒమన్ దేశం సమన్వయంతో ఒక ప్రత్యేక తరలింపు కారిడార్‌ను ఏర్పాటు చేశారు. ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరిన సమయంలో జరిగిన దాడుల్లో 40కి పైగా నౌకలు దెబ్బతినగా, కనీసం 14 మంది నావికులు మరణించారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ఈ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ముడి చమురు ధర కొన్ని సందర్భాల్లో బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిపోయింది. నౌకలను ఆఫ్రికా చుట్టూ లేదా ప్రత్యామ్నాయ భూమార్గాల ద్వారా మళ్లించాల్సి రావడంతో రవాణా ఖర్చులు భారీగా పెరిగి, సరుకు సరఫరా ఆలస్యమవుతోంది. దాదాపు 3,00,000 కంటైనర్ కార్గో ఇంకా అక్కడే చిక్కుకుపోవడంతో ప్రాంతీయ ఓడరేవులపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఉష్ణోగ్రతలకు దెబ్బతినే వస్తువులు, పాడైపోయే ఆహార పదార్థాల వల్ల బీమా క్లెయిమ్‌లు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజా పరిస్థితి.. రికవరీ ప్రయత్నాలు
జూన్ చివరి వారంలో గల్ఫ్ నుండి నౌకల రాకపోకలు కొంతవరకు పెరిగినట్లు షిప్పింగ్ డేటా సూచిస్తోంది. అయితే, లెబనాన్‌లో జరిగిన ఉల్లంఘనల కారణంగా ఈ మార్గాన్ని మళ్లీ మూసివేస్తామని ఇరాన్ ప్రకటించడం అనిశ్చితిని పెంచింది. అయితే కొన్ని నౌకల రాకపోకలు సాగుతున్నట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. హర్మూజ్, సూయజ్ కాలువ వంటి కీలక జలమార్గాలపైనే పూర్తిగా ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సిన అవసరాన్ని ఈ సంక్షోభం గుర్తుచేస్తోందని షిప్పింగ్ రంగ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

Strait of Hormuz
Global Trade Crisis
International Shipping News
Crude Oil Supply Disruption
Iran USA Geopolitical Tensions
Maritime Logistics Impact

More Telugu News